Thursday 20 November 2014

ఇదొక లెక్కా ?(3)

(part 1, 2 link ikkada )
బస్ వెళుతూ ఉంటె కాళేశ్వరం ఇంకా ఎంత దూరం ఉందొ 
అనుకుంటూ దేవుడు కిటికీ లో నా కోసం ఇచ్చిన ప్రకృతి 
ఫోటో ఆల్బం చూస్తూ కూర్చున్నాను . ఉన్నట్లుండి ఒక నల్ల మబ్బు 
 సూర్యుడిని కప్పుతూనో ,దూరంగా తెలిపోతూనో ఎక్కువగా చెట్లు 
మధ్యలో చిన్న కొండ గుట్టలు .... ఇక్కడ అడవిలో జంతువులు 
ఉంటాయా ,ఉండవా ..... ఎక్కడో ఒక్క ఊరు . దానిని ఊరు 
అని కూడా అనలేము . ఒక ఇరవై ఇళ్ళు అంతే . ముందుకు చూసాను . 
నాన్న వడిలో నుండి జారి పాప పరిగెత్తుతూ ఉంది . వాళ్ళు 
నవ్వుకుంటూ పట్టుకుంటున్నారు . నేను మా వారి వంక చూసేసరికి 
ఆయనే కూతురుని గొప్పగా చూసుకుంటూ ,నవ్వుకుంటూ ఇకీ 
నా వంక చూసారు . దొంగ మొహం అమ్మమ్మ దగ్గర ఉండిపోయింది . 
కనీసం అమ్మ దగ్గర కు వెళతాను అని ఏడవడం కూడా లేదు . 
వాళ్ళు నెల్లూరు కి వెళ్ళనీ చెపుతాను . 

అదిగో ఈ ఊరిలో ఒక చిన్న ప్రభుత్వ బడి . హమ్మయ్య చూస్తే 
సంతోషం వేసింది . ఇక్కడ కూడా బడు లు ఉన్నాయి పర్వాలేదు . 
నేను కాని సి .ఎమ్ అయితే (ఇది కొంచెం ఎక్కువే కాని ,చిన్న లక్ష్యం 
నేరం అని కలాం గారు చెప్పారు కదా అందుకు ) ప్రతి ఊరికి ఒక 
స్కూల్ పెట్టి అవన్నీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ గా మార్చి శాటిలైట్ 
తో అనుసంధానం చేసేస్తాను . పెద్ద స్క్రీన్ విడియో కాన్ఫెరెన్స్ ల కోసం ,
ఇంకా ప్రతి దగ్గర నుండి ప్రతి సంస్థకు లింక్  ఉండేటట్లు ,అన్నీ సోలార్ తో 
పనిచేసేట్లు .......... ఆ ఊరి పిల్లలనే ఇద్దరినీ నిర్వహించే జాబ్ 
ఇచ్చేస్తాను . 
అసలు పల్లెటూరి లో ప్రభుత్వ బడి ఎంత స్ట్రాంగ్ గా ఎన్ని వసతులతో 
ఉంటె ప్రభుత్వం అంత చక్కగా పాలించగలదు . 
నిజమేనా ? మరి ప్రభుత్వ బడి అంటే పల్లెటూళ్ళలో ఎంత 
ఉపయోగం తెలుసా ?తుఫాన్ షెల్టర్ అదే ,చదువుల గుడి అదే ,
పోలియో టీకాలు అక్కడే ,ఎన్నికల బూత్  లు అక్కడే ,
రచ్చబండలు అక్కడే , పిల్లల ప్లే గ్రౌండ్ అదే ,కొన్ని సార్లు 
న్యూస్ పేపర్స్ దొరికే గ్రంథాలయము ,ఇంకా చదువు రాని 
వాళ్ళు ఉత్తరాలు వ్రాయించుకునే దక్కడే ,ముహూర్తాలు రొయ్యల 
చెరువు కోసం పెట్టేది అక్కడే ,గ్రామ సభలు అక్కడే ,
కష్ట సుఖాలు  అక్కడే ,ధాన్యం ఆరపోసుకుంది అక్కడే ,ఒక్కోసారి 
బర్రెలను కట్టేది అక్కడే ..... ఇంకా సెలవల్లో పేకాట రాయుళ్ళ వేసవి విడిది . 

ఇలాంటి స్కూల్స్ ని ఇంకా పెంచుకుంటూ ఉంటె అవి ప్రభుత్వానికి 
సామంమత రాజుల కోటల్లాగా ఉపయోగపడుతాయి కాని ,
రేషనలైజేషన్ పేరుతో మూసేస్తే ప్రభుత్వానికి బలం తగ్గినట్లే . 
అసలు విద్య మీద పెట్టేది ఎంత పెంచితే దేశ అభివృద్ది సూచిక అంత
పెరిగినట్లు . 

ఆలోచనల్లోనే కాళేశ్వరం వచ్చేసింది . బస్ ఆగే స్థలానికి దగ్గర లోనే 
గుడి . పెద్ద పురాతనంగా లేదు . కొత్తగా కట్టినట్లే ఉంది . 
మరి యముడు స్థాపించాడు అన్నారు . గుడి చూస్తె అలా లేదు . 
గుడిలోకి అడుగు పెట్టగానే మాధురి పరుగో పరుగు . ఇంత సేపు 
దానికి కాళ్ళు కట్టేసినట్లు ఉన్నాయి పాపం . అందరం నవ్వుకొని 
ఆడుకోనీలే అని వదిలేసాము . ప్రాంగణం లో చిన్న నాలుగు స్తంభాలతో 
ఒక మండపం . దాని పైకప్పు మన నడుములు దాక వస్తుంది . 
ఏమిటబ్బా ఇది అనుకుంటూ వంగి చూసాను . ''యమ కోణం ''
అని వ్రాసి ఉంది. వీళ్ళు అందరు నా వైపు చూస్తున్నారు . ఇలాంటి 
సత్య శోధనలు నాకు భలే ఇంట్రెస్ట్ . అక్కడ బాణం గుర్తు ఉంది . 
ఓహో చక్కగా వంగి అవతలకి దూరాను . ఏముంది ఇక్కడ ?
ఏమి లేదే !అక్కడ ఇంకో బాణం మళ్ళీ వంగి మండపం నుండి 
బయటకు వచ్చాను . మొత్తానికి మండపం లో ప్లస్ లాగా దారిలో 
వెళ్లాను . ఏమిటో ఇది అర్ధం కాలేదు . 

లోపలి వెళ్ళాము . పెద్దగా జనాలు లేరు . ఇలాగ ఉంటె నాకు చాలా 
ఇష్టం . తోసుకుంటూ ఉంటె అసలు ఇష్టం ఉండదు . లోపలికి 
వెళ్లి లింగం వైపు చూసి నమస్కరిస్తూ ఆశ్చర్య పోయాము . 
ఒకే పానపట్టం పై రెండు లింగాలు . మళ్ళా ఒక లింగం మీద 
రెండు రంద్రాలు . 
''ఏమిటి స్వామీ ఇది ?''అడిగింది అమ్మ . హేమ చేత 
నమస్కారం పెట్టించింది . ఎక్కడకు వెళ్ళినా ఆ స్థలం 
గూర్చి అడగడం శ్రద్ధగా వినడం ,మళ్ళీ పిల్లలకు అర్ధం 
అయ్యేట్లు చెప్పడం మా అమ్మా నాన్నలకు అలవాటు . 
నాకు కొద్దిగా ఇలా అడగడం అలవాటు అయింది . 


''అమ్మా ఇది యముడు చేత స్థాపితం ,ఇది కాళేశ్వరుడు
ఇది ముక్తేశ్వరుడు. ''
''మరి ఒక లింగం మీద రెండు రంద్రాలు ఏమిటి ?''
''అవి నాసికా రంద్రాలు . శివుడు మీద పడిన అభిషేక జలం 
ఈ రంద్రాల గుండా వెళ్లి గోదావరిలో కలుస్తుంది ''

బాప్రే నిజమా !అందరం ఆశ్చర్య పోయి మళ్ళా భక్తిగా 
నమస్కరించుకున్నాము . హేమా మాత్రం పెట్టను అని మొండికేసి 
ఆటలో మునిగి పోయింది పక్కన ఉండే ఉడుతను చూస్తూ .   

''స్వామీ మరి బయట ఆ పొట్టి మండపం ఏమిటి ?''అడిగాను 
ఆత్రుతగా . 
''అది యమ కోణం . ఆ బాణం గుర్తులలో అందులో తిరిగితే 
యమ బాధలు ఉండవు ''అని చెప్పారు . 
గ్రేట్ . ఇంత చిన్నగా తిరిగితే యమ బాధలు ఉండవని తెలిస్తే 
ఎవరు మాత్రం తిరగకుండా ఉంటారు . తిరుగుదామని బయటకు వెళుతూ 
ప్రహరి గోడ పక్కనుండి చూసాను . కనుచూపు ఆనేంత 
దూరం లో గోదావరి నది .ఆకాశం నుండి బ్లూ రిబ్బన్ వేలాడదీసినట్లు ,
మరి లింగం పై పడిన అభిషేక జలం 
అంత దూరం వెళ్లి కలుస్తుందా !ఏమి టెక్నాలజీ !!
బహుశా అంతకు ముందు గోదావరి గుడికి ఇంకా దగ్గరలో 
ప్రవహించేదేమో !

అందరం మళ్ళీ యమ కోణం దగ్గరకు వెళ్లి అందులో నుండి 
దూరి ప్రదక్షిణం చేసాము . 
''హేమా నువ్వు వెళ్ళు ''అని వదిలాను . ఎదురుగా వెళ్ళు 
అంటే పక్కకు వెళుతుంది ,పక్కకు అంటే ఎదురుగా ,
కోప్పడదాము అంటే చప్పట్లు కొట్టి పక పక నవ్వేస్తుంది . 
దాని చేత సక్రమంగా ప్రదిక్షణం చేయించే యమ బాధ పడి 
హమ్మయ్య ఇంకా ఎవరికీ యమ బాధలు ఉండవు అని 
ఆనంద పది బయటకు వచ్చాము . ప్రహరి ప్రక్కనే 
సరస్వతి దేవి గుడి అమ్మవారు చక్కగా పసుపు పూసి 
అలంకరించుకొని వీణ పట్టుకొని నిజంగా అమ్మవారే ఎదురుగా 
కూర్చున్నంత కళగా ఉన్నారు . 
ప్రశాంతంగా మండపం లో కూర్చొని తినేసరికి బస్ శబ్దం . 
నిజానికి ప్రయాణమే ఎక్కువగా ఉంది కాని గుడిలో గడిపింది 
అరగంటే . అయితేనేం ఎంత ప్రశాంతంగా ఉంది . ఈ ఊరు ,
మనుషులు ,దేవుళ్ళు అన్నీ ఎంత ప్రశాంతంగా ..... ఎందుకో 
నెల్లూరు వాళ్ళు ఇక్కడకి పెద్దగా రారు . ఇక్కడ కూతుర్నీ 
నెల్లూరు  లో కోడలుగా చూడలేదు , అక్కడ  కూతురిని 
ఇక్కడ కోడలుగా చూడలేదు . ఒక్క సారి గుడి వైపు 
హాయిగా చూసి తిరుగు బస్ ఎక్కేసాము . కానీ ఈ 
ప్రశాంతత వెనుక రాబోయే కల్లోలం నాకు తెలీదు . 
                                               (ఇంకా ఉంది )

No comments: